ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: సాగర పరిరక్షణపై పార్లే సంస్థతో ఒప్పందం

Jyothi
Published on: 26 Aug 2022 6:35 AM IST
CM Jagan Visit to Visakhapatnam Today
X

ఇవాళ విశాఖలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సాగర తీర పరిరక్షణ కోసం అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన పార్లే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య బీచ్‌ పరిరక్షణపై ఎంవోయూ జరుగనుంది. 20 వేల మందితో 28కిలోమీటర్లు మేర బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరగనుంది.

ప్లాస్టిక్ పోరులో రాష్ట్రవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న విశాఖ నగరం. తాజాగా మరో ముందడుగు వేసింది. సుమారు 20 వేల మందితో భారీగా తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు ముమ్మర కసరత్తు చేశారు. విశాఖ నుంచి భీమిలి వరకు ఉన్న 28కిలోమీటర్ల పొడవైన తీరాన్ని మొత్తం 40 భాగాలుగా విభజించి ఒక్కో భాగంలో నిర్ణీత సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలతో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

విశాఖ సాగర తీరంలో తలపెట్టిన సాగర్ తీర స్వచ్ఛత బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏర్పాట్లను జిల్లా అధికారులు ఉమ్మడి జిల్లా సమన్వయఃకర్త వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్ నాథ్ పరిశీలించారు. ప్రజలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్స్, కాలేజీ విద్యార్థులు, సందర్శకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

న్యూయార్క్ కు చెందిన 'పార్లే ఫర్ ది ఓషన్స్' అనే స్వచ్ఛంద సంస్థ జీవీఎంసీ సహకారంతో విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఏపీలోను తన కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకొచ్చింది. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. సాగర గర్భంలోనూ, తీరం వెంబడి ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని పార్లే సంస్థ సేకరించి, వాటిని రీ సైకిల్‌ చేసేందుకు పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ, ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న 5 వేల మందికి ఉపాధి శిక్షణ ఇచ్చింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బీచ్ రోడ్డులో ఉన్న ఏయు కన్వేగేషన్ హల్లో సర్టిఫికెట్లు అందజేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story