పిల్లి సుభాష్-మోపిదేవిలకు జగన్‌ ఇవ్వబోతున్న గిఫ్ట్‌ ఏంటి.. ఊహించని బహుమానం సిద్దమైందా?

Arun Chilukuri
Published on: 30 Jan 2020 2:51 PM IST
పిల్లి సుభాష్-మోపిదేవిలకు జగన్‌ ఇవ్వబోతున్న గిఫ్ట్‌ ఏంటి.. ఊహించని బహుమానం సిద్దమైందా?
X
పిల్లి సుభాష్-మోపిదేవిలకు జగన్‌ ఇవ్వబోతున్న గిఫ్ట్‌ ఏంటి

మండలి రద్దుతో మంత్రులకు న్యాయం చేసే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారా ? రాజీనామా చేస్తున్న మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు సీఎం ఎటువంటి హామీ ఇచ్చారు? పార్టీ కోసం మంత్రి పదవులను సైతం త్యాగం చేసిన ఇరువురికి జగన్ బంపర్ బహుమానం ఇవ్వబోతున్నారా? ఇంతకీ ఇద్దరు నేతల త్యాగాలు, విధేయతలకు జగన్ ఇవ్వబోతున్న బహుమానమేంటి?

ఏపీలో అనేక ఉత్కంఠతల నడుమ శాసన మండలి రద్దుకు ఆమోదముద్ర వేసింది శాసనసభ. దీనితో ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ భవిష్యత్తేంటన్నదానిపై చర్చ మొదలైంది. మండలి రద్దు కావడంతో ఇప్పుడు సీఎం జగన్ ఇరువురికీ ఎలా న్యాయం చేస్తారనే దానిపై డిస్కషన్‌ సాగుతోంది. అయితే మండలి రద్దు విషయంలో సీఎం జగన్ వ్యూహాత్మక ఎత్తుగడతోనే ఉన్నారంటున్నారు పార్టీ కీలక నేతలు, మంత్రులు. మండలి రద్దు చేస్తే మంత్రులు సైతం వారి పదవులు సైతం పోయే అవకాశం ఉందని భావిస్తున్న సీఎం, వారికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరువురికి ఏ విధంగా న్యాయం చెయ్యబోతున్నారని ఇటు సొంత పార్టీ నేతలతో పాటు విపక్ష నేతలు సైతం ఎదురు చూస్తుండటంతో, జగన్‌ నిర్ణయంపై అందరి దృష్టినెలకొంది.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపించాలని ఆలోచిస్తున్నారట సీఎం జగన్. పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు, మోపిదేవి వెంకటరమణకు సీఎం స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి పదవులను సైతం తృణప్రాయంగా వదులుకోవడానికి వారు సిద్ధమయ్యారని సమాచారం. అయితే ఇరువురి విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి కూడా కారణం ఉందని అంటున్నారు పార్టీ నేతలు. వైసీపీ ఆరంభం నుంచి ఇద్దరూ సీఎం జగన్ ఆదేశాలతో అనేక త్యాగాలకు సిద్ధపడ్డారని, పార్టీ ప్రారంభంలో మంత్రి పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చెయ్యగా, మోపిదేవి వెంకటరమణ సైతం జగన్ మోహన్ రెడ్డితో జైలుకు సైతం వెళ్లారని, అందులో భాగంగానే సీఎం జగన్ ఇరువురి విషయంలో పక్కాగా నిర్ణయం తీసుకొని రాజ్యసభకు పంపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

అయితే మండలి రద్దుకు సంబంధించిన అంశంలో వ్యవహారం అంతా పక్కాగా నడుస్తుండగా, వచ్చే నెలలో భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఇరువురిని కూడా నామినేట్ చెయ్యడానికి సీఎం జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మండలి రద్దు విషయంలో ఒకవైపు ప్రతిపక్ష టీడీపీ, మంత్రుల రాజీనామాల విషయంలో తీవ్ర విమర్శలు చేస్తుండటంతో, వారిని కట్టడి చేసేందుకు మంత్రి పదవులకు రాజీనామా చేసిన నెలరోజుల వ్యవధిలోపు వారిని రాజ్యసభకు పంపేందుకు జగన్ సిద్ధమయ్యారట. ఇక వీరితో పాటు భర్తీ కాబోయే మరో రెండు స్థానాలకు కూడా పేర్లు ఖరారు చేశారట. అందులో ఒకరు టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కాగా, మరొకరు అయోధ్య రామిరెడ్డి అట.

మంత్రులతో పాటు వైవి, అయోధ్య రామిరెడ్డి విషయంలోనూ జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డికి 2019 ఎన్నికల్లో మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో అధికారంలోకి రాగానే ఆయన్ను టీటీడీ చైర్మన్‌గా నియమించారు. ఇక అయోధ్య రామిరెడ్డి విషయంలోనూ జగన్ కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారట. ఆళ్ల రామకృష్ణ రెడ్డి సోదరుడు అయిన అయోధ్య రామిరెడ్డి, 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన పరోక్షంగా మొదటి నుంచి పార్టీని అంటి బెట్టుకొని ఉండటంతో, అయోధ్య రామిరెడ్డికి కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి త్యాగాలతో పాటు పార్టీకి విధేయంగా వుంటూ వస్తున్న నేతలకు అగ్ర ప్రాధాన్యమిస్తున్నారని మరోసారి నిరూపించుకున్నారు సీఎం జగన్.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story