జగన్ ప్రభంజన అద్భుతానికి ఏడాది!

Arun Chilukuri
Published on: 23 May 2020 4:10 PM IST
జగన్ ప్రభంజన అద్భుతానికి ఏడాది!
X

ఓ అద్భుత విజయానికి సరిగ్గా ఏడాది. ఒక దశాబ్ధపు రాజకీయ సంఘర్షణకు, పోరాటానికి అపూర్వ విజయం లభించి నేటికి 365 రోజులు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజున అనేక మంది సెఫాలిజిస్టులు, అనలిస్టుల అంచనాలు మించి వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత మెజార్టీ అంటే మొత్తం 49.95 శాతం మొత్తం 50 శాతం ఓట్లతో 151 సీట్లను సాధించి విజయఢంకా మోగించింది.

2019 మే 23.. ఎన్నికలు ముగిశాక సుదీర్ఘకాలం వేచిఉన్న వైసీపీ శ్రేణులకు ఊపిరినిచ్చిన రోజు ఉత్సాహాన్ని పంచిన రోజు. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టాలలో కీలకమైనదిగా చెప్పుకునే విజయోత్సాహం అది. ఒక్కసారి వైసీపీ శ్రేణులన్నీ ఆ రోజులను గుర్తు తెచ్చుకొని సంబరాలు చేసుకుంటున్న రోజు. కరోనా లాక్‌డౌన్‌ అమలులో ఉంది కానీ.. గుర్తొస్తే వైసీపీ శ్రేణులను ఇప్పటికీ ఏ మాత్రం నిలువరించలేని విజయం.

ఇక ఒకసారి అప్పటి పరిస్థితులు గుర్తుతెచ్చుకుంటే వైసీపీకి విజయం నల్లేరుపై నడకేం కాలేదు. పార్టీ అధినేత 430 రోజుల పాటు 3వేల649 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాజకీయ నేత ఇంత తక్కువ సమయంలో ఇన్ని కిలోమీటర్ల యాత్ర చేసిన సందర్భాలు చాలా తక్కువని చెప్పాలి. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో తన తండ్రి సమాధి దగ్గర ఆశీస్సులు తీసుకొని అన్ని జిల్లాలోని 130 నియోజకవర్గాలను కలుపుతూ సాగింది ఆ విజయ యాత్ర. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆగి అక్కడి నుంచి నేరుగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టారు జగన్‌. 2014 ఎన్నికలలో కూడా గెలుపు వాకిట వరకు వచ్చి ఆగిపోయిన జగన్ వ్యూహాలన్నీ సత్ఫలితాల్ని ఇచ్చాయనే చెప్పాలి.

ఇక రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాల మధ్య పోరు, కొత్త రాష్ట్రం, 2009 వరకు సీఎం కుమారుడిగా, యువనాయకుడిగా తనకున్న గుర్తింపు, పరపతి అన్నీ దూరమై చెప్పిన మాట కోసం కాంగ్రెస్‌ని వీడి ఓదార్పు యాత్ర ప్రారంభించారు.16 నెలలు జైలులో ఉన్నా ఏ మాత్రం పట్టు సడలకుండా, 2014 ఎన్నికల్లో గెలుపు వాకిట్లో కుదేలై నిరాశ అవహించినా ఏ మాత్రం వెన్ను చూపకుండా తన లక్ష్యాన్ని అందుకున్న యువ నాయకుడు జగన్. నవరత్నాల పేరుతో పేదల జీవన ప్రమాణాలను పెంచడానికి విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమం, అభివృద్ధి, అవకాశాలు, ఉపాధి, పారిశ్రామికీకరణ లాంటి అంశాలతో పరిచయం చేసిన నవరత్నాలు అన్నీ కలిపి జగన్‌ని ప్రజల హృదయాల్లో ఎక్కడో నిలబెట్టడంతో రాయలసీమ మొత్తం మీద ప్రతిపక్ష పార్టీకి మూడంటే మూడు సీట్లే వచ్చాయి.

ఇక గత ఏడాది మే 23 న వైసీపీ ఘన విజయం సాధించింది. మే 30 న జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన పాలనకు ఏడాది పూర్తవ్వడానికి మరో వారం మిగిలి ఉంది. వైసీపీ శ్రేణులు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూనే ఈ వారం రోజులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయ్.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story