Memantha Siddham Bus Yatra: నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

Memantha Siddham Bus Yatra: ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూర్

Jyothi
Published on: 27 March 2024 7:17 AM IST
CM Jagan BusYatra from today
X

Memantha Siddham Bus Yatra: నేటి నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర

Memantha Siddham Bus Yatra: ఏపీలో ఎన్నికల వాతావరణంతో పొలిటికల్ పార్టీలన్నీ ప్రచారాలను స్పీడప్ చేశాయి. రెండోసారి అధికారం టార్గెట్‌గా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి దిగనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు కొనసాగనుంది.

ఇవాళ ఉదయం 10 గంటల 56 నిమిషాలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్ కడపకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల వరకు వైఎస్ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒంటి గంటా 30 నిమిషాలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ బస్సు యాత్ర వేంపల్లి, వీఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా పొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకుంటారు. అనంతరం సీఎం జగన్ రాత్రి అక్కడ బస చేస్తారు.

ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను రెడీ చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన విశాఖ, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమవుతారు.

ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలనే టార్గెట్‌తో ప్రచారంలోకి దిగబోతున్నారు వైసీపీ బాస్ జగన్. ఈ బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపి క్లీన్ స్వీప్ దిశగా ఎన్నికల్లో పని చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు జగన్.

Jyothi

Jyothi

Next Story