మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో వార్‌.. పవన్, చిరు పేర్లతో హల్ చల్ చేస్తున్న నకిలీ లేఖలు !

Arun Chilukuri
Updated on: 23 Dec 2019 2:29 PM IST
మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో వార్‌.. పవన్, చిరు పేర్లతో హల్ చల్ చేస్తున్న నకిలీ లేఖలు !
X
పవన్, చిరు

పవన్ పార్టీని మూసేయబోతున్నాడు - బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమంటున్నాడు - కార్యకర్తలుగా సలహాలు ఇస్తే పాటిస్తాం - జగన్‌ను సమర్ధిస్తూ చిరు మాట్లాడలేదు - పరిపాలన వికేంద్రీకరణకు మెగస్టార్ మద్దతివ్వలేదు - త్రివిధ రాజధానులకు చిరంజీవి తూచ్ అన్నారు.

ఇది మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. మెగా ఫ్యామిలీ వీరాభిమానులు, సన్నిహితులు, సహచరులను ఈ లేఖలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అసలు ఎవరు ఏం చెప్పారో ఏం చేస్తున్నారో అసలు ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. ముఖ్యంగా పవన్ పేరుతో జరుగుతున్న ప్రచారంపై అభిమానులు ఓ వైపు ఆవేదన వ్యక్తం చేస్తునే మరో వైపు తీవ్రంగా మండిపడుతున్నారు.

చిరు ప్యామిలీలో అన్నదమ్ముల మధ్య భేద్రాభిప్రాయాలు ఉన్నాయంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై బహిరంగంగా ఎవరూ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోవడంతో సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన త్రి విధ రాజధాని ప్రకటనపై మెగాస్టార్ స్పందించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. 13 జిల్లాల ఏపీ సమగ్రాభివృద్ధి సాధించేలా సీఎం జగన్ చక్కని నిర్ణయం తీసుకున్నారంటూ స్వయంగా తన లెటర్‌ హెడ్‌పైనే ప్రకటన విడుదల చేశారు. అయితే ఇదే సమయంలో త్రివిధ రాజనులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ టార్గెట్‌గా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అభివృద్ధి దిశగా మెగాస్టార్ ఆలోచిస్తుంటే పవర్ స్టార్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఓ వర్గం ప్రచారానికి దిగింది. ఇదే సమయంలో త్రివిధ రాజధానుల ప్రతిపాదనపై మెగస్టార్ ఎలాంటి ప్రకటన చేయాలేదంటూ సోషల్ మీడియాలో లేఖలు హల్ చల్ చేశాయి. అన్ని ప్రాంతాల సహకారంతో ఎదిగిన తాను ఏ ఒక్క ప్రాంతానికి అనుకూలంగా కాని , వ్యతిరేకంగా కాని వ్యవహరించలేదంటూ ఈ లేఖలో ఉంది. దీంతో అభిమానుల్లో తీవ్ర గందరగోళం రేగింది. అసలు మెగస్టార్ స్పందించకపోతే లేఖ ఎవరు ఇచ్చారు ? ఎవరో ఇచ్చిన లేఖపై చిరు ఎందుకు స్పందించారు అనే ప్రశ్నలు వినిపించాయి.

ఈ లేఖలు టార్గెట్‌గా అటు చిరు అభిమానులు ఇటు ఇతర వర్గాల మధ్య వార్‌ జరగుతుండగానే మరో బాంబు లాంటి వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. జనసేన లెటర్‌ హెడ్‌పై డిసెంబర్‌ పదవ తేదితో ఓ ప్రకటన జారీ అయ్యింది. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని దీనిపై వచ్చే నెల 31 లోపు అభిప్రాయాలు చెప్పాలంటూ కోరారు. దీంతో అసలు ఏం జరగుతుందో తెలుసుకునేందుకు అటు జన సైనికులు ఇటు మెగా అభిమానులు రంగంలోకి దిగారు. దీంతో ఫేక్ లెటర్ల అసలు బాగోతం వెలుగు చూసింది. మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ఇలాంటి కుట్రలు చేశారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అయితే ఇదే సమయంలో త్రివిధ రాజధానులను సమర్ధిస్తూ తాను జారీ చేసిన ప్రకటన నిజమైనదేనని తన పేరుతో ఈ నెల 22న విడుదల అయిన లేఖ మాత్రం నకిలీందంటూ మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలంటూ ప్రత్యేకంగా కోరారు. ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు పార్టీలో ఉండటం సహజమని అయినా ఇలాంటి ప్రచారాలు చేయడం సరికాదంటున్నారు మెగా ఫ్యామిలి అభిమానులు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నా కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story