కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన

Chandrababu: కుప్పం, గుడుపల్లి మండలాల్లో పర్యటించనున్న చంద్రబాబు

Jyothi
Published on: 26 Aug 2022 10:05 AM IST
Chandrababu Third Day Visit to Kuppam
X

కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటన

Chandrababu: ఇవాళ కుప్పంలో చంద్రబాబు మూడోరోజు పర్యటించనున్నారు. కుప్పం, గుడుపల్లి మండలాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం.. ఉదయం 11 గంటలకు కుప్పం మోడల్‌ కాలనీలో చంద్రబాబు పర్యటిస్తారు. కృష్ణదాసనపల్లి, జరుగు, గుడ్లనాయనపల్లి గ్రామాల్లో ప్రజలతో సమావేశం కానున్నారు. అలాగే.. సాయంత్రం 5 గంటలకు ఓఎన్‌ కొత్తూరులో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు చంద్రబాబు.

ఇదిలా ఉంటే.. నన్నిటి ఘటనలతో ప్రశాంతతకు నిలయమైన కుప్పం పట్టణం రణరంగాన్ని తలపించింది. వైసీపీ, టీడీపీ ర్యాలీలు, ఇరుపార్టీల విధ్వంసం, పోలీసుల లాఠీచార్జీతో కుప్పం పట్టణం ఒక్కసారిగా అట్టుడికింది. టీడీపీ బ్యానర్లు, జెండాలు ధ్వంసం, అన్న క్యాంటీన్‌ విధ్వంసం వంటి వరుస ఘటనలతో కుప్పం అతలాకుతలమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండోరోజు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలోని అన్న క్యాంటీన్‌ వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేయడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. చంద్రబాబు సహా పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌ ఇంటివైపు టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జీని నిరసిస్తూ చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి అన్న క్యాంటీన్‌ వరకు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం, పోలీసుల వ్యవహారంపై నిప్పులు చెరిగారు. అధికారపార్టీ నేతలకు, కార్యకర్తలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు.

కుప్పంలో చంద్రబాబు పర్యటన తొలిరోజున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంగనపల్లి, కొల్లుపల్లిలో వైసీపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలు కట్టి.. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడంతో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ.. వైసీపీ శాంతియుత ర్యాలీ నిర్వహించింది. బస్టాండ్‌ సమీపంలోని వైఎస్సార్‌ విగ్రహం ఎదుట వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. చంద్రబాబు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ప్యాలెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు.

Jyothi

Jyothi

Next Story