Vijayawada: ఎంపీ, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Vijayawada‌:విజయవాడ టీడీపీ నేతలపై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు.

Samba Siva Rao
Updated on: 21 Feb 2021 6:29 PM IST
Chandra babu Fire On Tdp Mp kesineni
X

చంద్ర బాబు ఫైల్ ఫోటో 

Vijayawada:విజయవాడ టీడీపీ నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. బహిరంగంగా విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేదిలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 39వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ అభ్యర్థి విషయంలో టీడీపీ ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ బుధ్ద వెంకన్న మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతోపాటు పార్టీపై బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు వెంకన్న.

అయితే గత కొంతకాలంగా ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బుద్ధా వెంకన్న వర్గీయులైతే.. ఏకంగా ఎంపీ కేశినేని నానిని నిలదీశారు. ఈ తరుణంలో టీడీపీపై ఎంపీ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు సానుకూల ఓట్లుగా మలచుకోవలసిన తరుణంలో అంతర్గత విభేదాలతో నాయకులు రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది. 39వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌ అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో ఉన్న గుండారపు పూజితను కాదని, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి ఎంపీ కేశినేని టికెట్‌ ఇవ్వడం, డివిజన్‌లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రావడం బుద్ధా వెంకన్న వర్గీయుల్లో ఆగ్రహానికి కారణమయింది.

ఎంపీ నానిని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజిత తదితరులు అడ్డుకుని నిలదీశారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబమని ప్రశ్నించారు. దీంతో ఈ విషయం అధిష్టానం దృష్టికి చేరడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అప్పగించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story