Chandrababu: హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిష‌న్ దాఖలు

Chandrababu: సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూచంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Kranthi
Published on: 18 March 2021 1:20 PM IST
Chandrababu Kwash Petition in the Highcourt on Amaravati Lands Issue
X

చంద్రబాబు నాయుడు (ఫోటో: ఫైల్ ఇమేజ్)

Chandrababu: టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబు నాయుడు రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. మ‌రోవైపు, నేడు త‌మ‌ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు సీఐడీ నోటీసులపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) ప్రకారం సీఐడీ నోటీసులిచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరించింది.

సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు...

ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ సైబర్‌ సెల్‌ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆరు రోజుల కిందట సీఐడీ కేసు నమోదు చేయగా.. ఆ ఎఫ్‌ఐఆర్‌ మంగళవారం వెలుగుచూసింది. ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌),(జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి పి.నారాయణను ఏ2గా పేర్కొంది.

Kranthi

Kranthi

Next Story