ఎస్‌ఈసీ, సర్కార్ మధ్య ముదురుతోన్న వార్‌.. వేటేసిన అధికారులకు కీలక పోస్టింగులు

*ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతూనే మరోవైపు ఎస్‌ఈసీపై అటాక్‌ *ఎస్‌ఈసీ వేటేసిన అధికారులకు కీలక పోస్టింగ్స్ ఇస్తోన్న ప్రభుత్వం *ఇద్దరు ఐఏఎస్‌లపై ఎస్‌ఈసీ సెన్సూర్ ఉత్తర్వులు *ఎస్ఈసీ సెన్సూర్‌ను తిరస్కరిస్తూ తిప్పిపంపిన జగన్ సర్కార్‌

Arun Chilukuri
Updated on: 28 Jan 2021 9:00 PM IST
ఎస్‌ఈసీ, సర్కార్ మధ్య ముదురుతోన్న వార్‌.. వేటేసిన అధికారులకు కీలక పోస్టింగులు
X

ఎస్‌ఈసీ, సర్కార్ మధ్య ముదురుతోన్న వార్‌.. వేటేసిన అధికారులకు కీలక పోస్టింగులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఈసీ అండ్‌ సర్కార్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. సీఎం జగన్‌, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సుప్రీం తీర్పుతో తప్పని పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు సై అన్న ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డపై మాత్రం తన అటాక్‌ను తీవ్రస్థాయిలో కొనసాగిస్తోంది. సుప్రీం జడ్జిమెంట్‌ తర్వాత దూకుడుగా వెళ్తున్న ఎస్‌ఈసీ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. తన మాట వినని అధికారులపై ఎస్‌ఈసీ వేటు వేస్తుంటే అదే అధికారులకు కీలక పోస్టులు కట్టబెడుతూ ప్రభుత్వం అందలమెక్కిస్తోంది. నువ్వు చేసేది నువ్వు చేయ్‌ మేం చేసేది మేము చేస్తామన్న రీతిలో జగన్ సర్కార్‌ చర్యలు ఉంటున్నాయ్‌. దాంతో, ఎస్‌ఈసీ అండ్‌ సర్కార్ మధ్య వార్ మరింత ముదురుతోంది.

సుప్రీం జడ్జిమెంట్‌‌తో ఒకవైపు చకచకా పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరిగిపోతుంటే మరోవైపు, ఎస్‌ఈసీ సర్కార్ మధ్య యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతోంది. మొన్నటివరకు ఎలాగైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ఏదోవిధంగా ఆపాలని ప్రభుత్వం హోరాహోరీగా తలపడితే ఇప్పుడు, జగన్ సర్కార్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మధ్య మరో వార్ మొదలైంది. పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌పై ఎస్‌ఈసీ ఇచ్చిన సెన్సూర్ ఆదేశాలను ప్రభుత్వం తిరస్కరించడం సంచలనంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను తిరస్కరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి వివరణ కోరకుండా ప్రోసీడింగ్స్‌ ఇవ్వలేమంటూ జగన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

తన ఆదేశాలను ధిక్కరించిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ వేటు వేశారు. అంతేకాదు, వారి సర్వీస్ రికార్డులో రిమార్క్‌ నమోదయ్యేలా సెన్సూర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై ఎస్ఈసీ చర్యలకు సిఫార్సు చేయడాన్ని జగన్‌ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎస్‌ఈసీ ప్రోసీడింగ్స్‌ను అమలు చేయలేమంటూ సెన్సూర్ ఆదేశాలను తిప్పిపంపింది. అధికారుల నుంచి వివరణ కోరకుండా సెన్సూర్ ఉత్తర్వులు జారీ చేయడం తగదని, అయినా ఐఏఎస్‌లపై ప్రోసీడింగ్స్‌ జారీ చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని అంటోంది. దాంతో, ఇద్దరు ఐఏఎస్‌లపై జారీ చేసిన సెన్సూర్ ఉత్తర్వులను ఎస్‌ఈసీ రమేష్ కుమార్‌ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు పంపారు.

ఇద్దరు ఐఏఎస్‌లపై సెన్సూర్ ఉత్తర్వులను తిరస్కరిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు సెన్సూర్ ఉత్తర్వులను పంపిన నిమ్మగడ్డ కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరు ఐఏఎస్‌లపై తాను జారీ చేసిన సెన్సూర్ ఉత్తర్వులను అమలు చేయాలని మరోసారి కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎస్‌ఈసీ ఉత్తర్వులను కేంద్రం సమర్ధిస్తే మాత్రం వార్ మరో మలుపు తిరగడం మాత్రం ఖాయం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story