ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు మారాయి..!

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను మరో రెండు రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 19 Sept 2025 4:18 PM IST
ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు మారాయి..!
X

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులను మరో రెండు రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

వాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు (మొత్తం 9 రోజులు) ఇవ్వాలని మొదట నిర్ణయించింది. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు విద్యార్థుల తరపున మంత్రి లోకేష్‌ను కోరారు. దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని, సెలవులను సెప్టెంబర్ 22 నుంచే ఇవ్వాలని అభ్యర్థించారు.

ఎమ్మెల్సీల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్, విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవుల తేదీలను మార్చారు. తాజా నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు (మొత్తం 11 రోజులు) దసరా సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 21 ఆదివారం కావడంతో, విద్యార్థులకు మొత్తం 12 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ విద్యార్థులకు భారీగానే దసరా సెలవులు వచ్చాయి. అక్కడ సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు (మొత్తం 13 రోజులు) సెలవులను ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

అయితే, ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2న రావడంతో, అదే రోజున గాంధీ జయంతి కూడా ఉండటంతో విద్యార్థులు ఒక సెలవును కోల్పోయారు. ఏదేమైనా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈసారి దసరా సెలవులను పూర్తిగా ఆస్వాదించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story