Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు

AP High Court Granted Interim Bail to Chandrababu
x

Chandrababu: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు

Highlights

Chandrababu: 4 వారాల పాటు బెయిల్‌ మంజూరు

Chandrababu: దాదాపు 53 రోజుల తర్వాత ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని కోరడంతో.. ఏపీ హైకోర్ట్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 10న ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు. చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు‌ను తీసుకువెళ్ళి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్‌ఎస్‌జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, బ్రాహ్మణి రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు‌కు బెయిల్ మంజూరు అయిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని నాయకులు, కార్యకర్తలతో అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories