AP ESI scam: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆర్డర్ ఇచ్చారు..ఈఎస్ఐ కేసులో త్వరలోనే చార్జిషీటు వేస్తాం!

AP ESI scam: ఈఎస్ఐ స్కాం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర స్పష్టంగా ఉందని..ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ చెప్పారు.

K V D Varma
Published on: 20 Aug 2020 7:02 AM IST
Acchennaidu involved in ESI scam says ACB Joint Director ravi kumar
X
Acchennaidu (file image)

ఈఎస్‌ఐ కేసులో త్వరలోనే చార్జిషీటు వేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్, రవికుమార్ స్పష్టం చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి అచ్చేన్నాయుడుకు ప్రమేయం ఉందని ఆయన వెల్లడించారు. మంత్రి హోదాలో కొనుగోళ్ళ కోసం అయన ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. ప్రజాప్రతినిధులు సిఫార్సు ఇవ్వడం‌ వేరు, కచ్చితంగా చేయాలని ఆర్డర్‌ ఇవ్వడం వేరు అని చెప్పిన విజయకుమార్ అచ్చెన్నాయుడు కచ్చితంగా ఫలానా కంపెనీలకే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని తేలినట్టు తెలిపారు. ఈ విషయంలో టెలీహెల్త్‌ సర్వీసెస్‌కు సంబంధించి అచ్చెన్న మొత్తం మూడు లేఖలు ఇచ్చారన్నారు.

ఈ స్కాంలో మొత్తం 975 కోట్ల కొనుగోళ్లలో 150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు నిర్ధారించామని రవి కుమార్ తెలిపారు. కొనుగోళ్ల మొత్తం విలువ లక్ష దాటితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి, కానీ నామినేషన్‌ కింద ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా ''కడప రీజనల్ జాయింట్‌ డైరెక్టర్‌ జనార్దన్‌ ఇందులో కీలకపాత్ర పోషించారు. అధిక ధరలతో బడ్జెట్‌కు మించి కొన్ని మందులు 140% ఎక్కువ రేటుకు కొన్నారు. డ్రగ్స్‌కు 293.51 కోట్లు కొనుగోలుకు అవకాశం ఉండగా, 698.36 కోట్లకు కొన్నారు. డిస్పెన్సరీల నుంచి ఇండెంట్‌లు లేకుండానే కొన్న మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదు. అమరావతి, తిరుమల వంటి మెడికల్‌ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి మాయమయ్యాయి. ఈ కేసులో 12మందిని అరెస్టు చేశాం, మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరో 5 మంది నిందితుల కోసం ఏసీబీ బృందాలు గాలిస్తున్నాయి. మాజీమంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్ కోసం గాలిస్తున్నాం అని ఏసీబీ జాయింట్ డైరెక్టర్, రవికుమార్ వివరించారు.






K V D Varma

K V D Varma

Next Story