ఏపీలో మళ్లీ హీట్ పుట్టిస్తున్న స్థానిక ఎన్నికల సమరం

Arun Chilukuri
Published on: 8 Jan 2021 9:48 PM IST
ఏపీలో మళ్లీ హీట్ పుట్టిస్తున్న స్థానిక ఎన్నికల సమరం
X

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరం హీటెక్కిస్తోంది. అసలు జరుగుతుందా లేదా అనే సందిగ్ధ స్థితిలో చర్చలు కొనసాగుతున్నాయ్. ప్రభుత్వం నుంచి ముగ్గురు ప్రతినిధులు ఎస్ఈసీని కలవాలన్న హైకోర్టు ఆదేశాలతో, సీఎస్ సహా బృందం నిమ్మగడ్డతో భేటీ అయింది.

ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సీఎస్ అదిత్యానాథ్ సహా అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయని ఎస్ఈసీకి తెలిపారు సీఎస్. వ్యాక్సినేషన్‌లో సిబ్బంది తలమునకలై ఉన్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కాలేమని వివరించారు. ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేశారు. మరికొంతకాలం వాయిదా వేయాలని ఎస్ఈసీని కోరారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో దాదాపు గంటన్నరపాటు ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ అయింది. సీఎస్‌తో పాటు గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమావేశంలో చర్చ జరిగింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను సీఎస్‌కు ఎస్ఈసీ తెలియజేశారు. ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావాలంటే సకాలంలో ఎలక్షన్ నిర్వహించి తీరాలన్నారు.

దేశంలో పలుచోట్ల ఎన్నికలు నిర్వహించినందున ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని ఎస్ఈసీ సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఐతే ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందులను ఎస్ఈసీకి ప్రభుత్వ ప్రతినిధుల బృందం వివరించింది. కరోనా వ్యాప్తి సహా కొత్తగా నమోదవుతోన్న కేసులపై ఎస్ఈసీకి నివేదిక ఇచ్చారు సీఎస్. వ్యాక్సినేషన్ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై నివేదికను సమర్పించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తుదినిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story