ముగిసిన ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన

Arun Chilukuri
Published on: 16 Dec 2020 12:55 PM IST
ముగిసిన ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
X

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. సమావేశంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి తగిన సాయం చేయాల్సిందిగా భేటీలో మంత్రిని కోరారు సీఎం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించారు. ఇక పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం 55వేల 656కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా వేయి 779కోట్ల రూపాయలను రియింబర్స్‌ చేయాల్సి ఉందని జగన్‌ భేటీలో వెల్లడించారు. 2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈ బిల్లులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా పెరిగిపోతుందని ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇక సీఎం జగన్ అభ్యర్థనలపై షెకావత్‌ సానుకూలంగా స్పందిచినట్లు తెలుస్తోంది. అలానే నదుల అనుసంధానంపై ఏపీతో చర్చించాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను షెకావత్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు ఏపీకి రావాలని జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్‌ను జగన్‌ ఆహ్వానించారు.

మరోవైపు భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాల్సిందిగా కోరారు. 2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. 44వేల 574 కుటుంబాల నుంచి లక్షా ఆరు వేలకు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్న సీఎం దీనివల్ల ఆర్‌ అండ్‌ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story