AP News: ఏపీలో జిల్లాలు, మండలాల పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం

AP News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు, చేర్పులపై కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 22 July 2025 3:11 PM IST
AP Cabinet Sub Committee for Renaming Districts Mandals Villages
X

AP News: ఏపీలో జిల్లాలు, మండలాల పేర్ల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం

AP News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు, చేర్పులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సమగ్రమైన అధ్యయనం చేసి ప్రతిపాదనలు సమర్పించేందుకు మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

ఈ మంత్రివర్గ ఉపసంఘంలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉండగా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఉపసంఘ సభ్యులుగా అనగాని సత్యప్రసాద్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్‌లను ప్రభుత్వం నియమించింది.

ఈ కమిటీకి పాలనాపరమైన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిహద్దులు నిర్ణయించే సమయంలో:

మండలాల మధ్య భౌగోళిక దూరాన్ని

ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని

జనాభా వివరాలు, భౌగోళిక పరిస్థితులు

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా ఉండే ప్రాంత విభజనను

పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చింది.

ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాలను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు, సీసీఎల్‌ఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.

ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా భౌగోళిక పరంగా సమతుల్యతను తీసుకురావడంలో, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో కీలకంగా నిలవనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story