Ap ministers tested coronavirus : ఒకే రోజు ఇద్దరు మంత్రులకు కరోనా

Ap ministers tested coronavirus : ఒకే రోజు ఇద్దరు మంత్రులకు కరోనా
x
Highlights

Ap ministers tested coronavirus : గత ఆరు, ఏడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కొన్ని రాష్ట్రాల్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ...

Ap ministers tested coronavirus : గత ఆరు, ఏడు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కొన్ని రాష్ట్రాల్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అతి వేగంగా విస్తరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కేసుల సంఖ్య విపరీతంగా భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని సామాన్య ప్రజలతో పాటు, అధికారులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం మరికొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే సోమవారం వెలవడిన కేసుల్లో ఒక్క రోజే ఇద్దరు ఏపీ మంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంత్రులు ఈ రోజు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా వారిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఉదయం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇక మధ్యాహ్నం పూట మంత్రి వేణుగోపాలకృష్ణ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఈ విషయం తెలియగానే మంత్రి వేణుగోపాలకృష్ణ తనను కలిసిన వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని రోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్న వారు, తనతో కాంటాక్ట్‌లో ఉన్న, ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఇక ఈ విషయం తెలియగానే ఆయనతో తిరిగిన కొంత మంది నేతలు ఇప్పటికే హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇక మంత్రి వేణుగోపాల్ ఇటీవలే తిరుమల క్షేత్రంలో వైభవంగా జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణంగా పూర్తయ్యేంత వరకు మంత్రి సీఎం జగన్ వెంటే ఉన్నారు. అంతే కాదు ఆయనతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో, మీటింగ్ లలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు ఒకరిద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మంత్రి వేణుగోపాల్ తో పాటు బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు. అయితే ఈ రోజు చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈయన తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతే కాదు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో సుమారు వారం రోజుల పాటు మంత్రి వెల్లంపల్లి తిరుమల క్షేత్రంలోనే బసచేసారు. ఈ నెల 25వ తేదీన విజయవాడకు చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రికి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ నిర్ధారిత పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఇక పోతే కొద్ది రోజుల క్రితం అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథం ప్రమాదవశాత్తు కాలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం రోజున అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి నూతన రథం నిర్మాణం చేయడానికి ఆలయ అధికారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి మంత్రి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మంత్రి ధర్మాన మీడియా మీట్ కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా వేణుగోపాల్ హాజరయ్యారు. మంత్రికి పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories