సీఎం జగన్ క్రీస్టియన్ అనేందుకు ఆధారాలేమిటి? పిటిషనర్ ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

సీఎం జగన్ క్రీస్టియన్ అనేందుకు ఆధారాలేమిటి? పిటిషనర్ ను ప్రశ్నించిన  ఏపీ హైకోర్టు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళినపుడు నిబంధనలు పాటించలేదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇటీవల తిరుమల వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించారు అంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయినప్పటికీ, తిరుమలలో నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వలేదని ఇది చట్ట విరుద్ధమని గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన ఎ.సుధాకర్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారణకు చేపట్టాలంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఆధారాలు సమర్పించకుండా సీఎం హిందువు కాదు క్రైస్తవుడని కోర్టుకు ఎలా చెబుతారని వ్యాఖ్యానించింది. వివరాలు లేకుండా వ్యాజ్య విచారణలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అదనపు వివరాలు సమర్పించేందుకు వీలుగా విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

అదేవిధంగా పిటిషన్ లో గవర్నర్ ను ప్రతివాదుల జాబితాలో చేర్చడం పై కూడా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి అభ్యర్థన కోరనప్పుడు ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. ఆయన్ను జాబితా నుంచి తొలగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. తిరుమలలో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉందనీ, దేవాదాయశాఖ చట్ట నిబంధన 136, 137 ప్రకారం హిందూయేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, క్రైస్తవుడయిన సీఎం.. డిక్లరేషన్‌ ఇవ్వకుండా వెళ్లారాణి కోర్టుకు తెలిపారు. ఇది దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 97, 153లకు విరుద్ధమని అన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఆయన క్రైస్తవుడు అని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలేమున్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పష్టతిచ్చేలా కోరాలని న్యాయవాది బదులిచ్చారు. తామెందుకు ముఖ్యమంత్రిని అడగాలి.. వ్యాజ్యం దాఖలు చేసిన మీరే ఆధారాలు చూపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు పలు క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని, సీఎం ఈ వివాదంపై మౌనంగా ఉండటంతో ఆయన్ను క్రిస్టియన్‌గా భావించాల్సి వస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీఎం క్రైస్తవుడనే ఆధారాలు సమర్పించేందుకు గడువిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories