AP Government on Construction of Houses: ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూత..

AP Government on Construction of Houses: ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూత..
x
AP Government on Construction of Houses
Highlights

AP Government on Construction of Houses: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వాటి నిర్మాణం చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.

AP Government on Construction of Houses: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వాటి నిర్మాణం చేపట్టే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అవసరమైన వ్యయాన్ని తక్కువయ్యే విధంగా రూపకల్పన చేస్తోంది. దీంతో పాటు పేదలుకు పంపిణీ చేసే స్థలాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా వెళుతోంది. దీంతో పాటు భవిషత్తు అవసరాలకు వినియోగించుకునేందుకు సామాజిన స్థలాలను కేటాయించింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోన్న‌ గృహ నిర్మాణ స్కీమ్ లో భాగంగా లబ్దిదారులకు రూ. 1.95 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసేలా అధికారులు ప్లానింగ్ రెడీ చేశారు. ఇందుకు కావాల్సిన‌ నిర్మాణ సామగ్రిని లబ్దిదారుల ఇళ్ల‌కే చేరవేయాలని నిర్ణయించారు. ఇసుకను ఫ్రీగా ఇవ్వ‌డంతో పాటు..సిమెంటు బస్తా రూ. 225కు ఇవ్వనున్నారు. ఇటుకలు, తలుపులు, కిటికీలు, ఇనుప కడ్డీలు, విద్యుత్తు పరికరాలు, రంగులు, శానిటరీ వస్తువులు, మార్కెట్​ ధర కంటే తక్కువకు అందించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్పటికే నిర్ణ‌యించిన‌ మొత్తంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నమూనా గృహాన్ని నిర్మించారు.

దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఒక కొత్త చరిత్ర ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో దాదాపు 20 శాతం కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సంబంధించిన కాలనీలు రూపుదిద్దుకుంటుండటం కనిపిస్తోంది. కాలనీల ఏర్పాటు గతంలోలా బలహీన వర్గాల గృహ సముదాయంలా ఉండదు. ఎలాంటి వసతుల్లేని అగ్గిపెట్టెల్లాంటి.. డబ్బాల్లాంటి ఇళ్లు కాదు. విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించారు.

ఇల్లు లేదనే వారు ఉండకుండా సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హత ఉన్నప్పటికీ ఇంటి స్థలం రాలేదని ఎవరైనా అంటే.. ఏ విధంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలో అందులో సూచించారు. వారి దరఖాస్తులు తీసుకుని అర్హత ఉంటే వెంటనే మంజూరు చేస్తున్నారు. ఇదంతా పారదర్శక పద్దతుల్లో, అవినీతికి తావు లేకుండా జరిగిపోయింది. ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాల్లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం లే అవుట్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మౌలిక సదుపాయాలకు పెద్దపీట

► అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని మామూలుగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రచారం చేసుకుంటుండటం మనం చూశాం. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రీతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని పరితపిస్తూచర్యలు తీసుకుంటోంది.

► 'నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని అర్హులందరికీ నివాస స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న లే అవుట్లలో మౌలిక సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు.

► రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు తెల్ల కార్డే అర్హతగా ఎంపిక చేసిన సుమారు 30 లక్షల మందికి నివాస స్థలాలను విక్రయ దస్తావేజుల (కన్వేయన్స్‌ డీడ్ల) రూపంలో రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

30 అడుగుల రోడ్లు

► ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రూపొందిస్తున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీ(లేఅవుట్ల)ల్లో 30 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు నిర్మించనున్నారు. విశాలమైన రోడ్ల నిర్మాణానికి స్థలాలు వదిలేసి ప్లాట్లు వేస్తున్నారు.

► కొన్ని జిల్లాల్లో అక్కడి పరిస్థితులు, లేఅవుట్‌ పరిమాణాన్ని బట్టి 40 నుంచి 60 అడుగుల వెడల్పుతో ప్రధాన రోడ్ల నిర్మాణానికి వీలుగా లేఅవుట్లు ప్లాన్‌ చేశారు.

విజయనగరం జిల్లాలో అతి పెద్ద లే అవుట్‌..

► జిల్లా కేంద్రమైన విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామంలో 357.50 ఎకరాల్లో అతి పెద్ద లేఅవుట్‌ రూపొందిస్తున్నారు.

► ఇక్కడ పోలీస్‌ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు బజార్లు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించడానికి లే అవుట్‌ను సిద్ధం చేస్తున్నారు.

సామాజిక అవసరాల కోసం స్థలాలు

► అధిక విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న పెద్ద లేఅవుట్ల(కాలనీల)లో విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఖాళీ స్థలాలు వదిలేసి ప్లాట్లు ప్లాన్‌ చేశారు.

► సామాజిక అవసరాలకు అవసరమైనంత మేరకు స్థలాలు వదిలేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏమి కావాలన్నా అక్కడే దొరికే విధంగా వీటిని ప్లాన్‌ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

పచ్చని తోటల మధ్య..

► చాలా చోట్ల గ్రామాలకు, పట్టణాలకు ఆనుకొని పచ్చని తోటలు, చెట్లతో నిండిన కొండలు, పొలాల పక్కన జగనన్న కాలనీల కోసం స్థలాలు ఎంపిక చేశారు.

► దీంతో గృహ నిర్మాణం తర్వాత అక్కడ నివసించే వారికి స్వచ్ఛమైన గాలి అందనుంది. పచ్చదనంతో వాతావరణం కూడా చల్లగా ఉండనుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండ్ల తోటలు, పచ్చని పొలాల పక్కన లే అవుట్లు చూడ ముచ్చటగా రూపు దిద్దుకుంటున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి కాలనీలకు అవసరమైన తాగునీరు, విద్యుత్తు సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది.

నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు...

► దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన 29 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

► ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తమ ఉద్దేశం కాదని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇల్లు లేని కుటుంబం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని సీఎం జగన్‌ పదే పదే చెబుతున్నారు. అందువల్ల నివాస యోగ్యమైన ప్రాంతాలనే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.

ఒకే నమూనాలో ఇళ్లు

► పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత నిర్మించే కాలనీలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీ అని పేరు పెట్టనున్నారు. ఈ కాలనీల్లో ఇళ్లన్నీ ఒకే నమూనాలో నిర్మిస్తారు. ప్రతి ప్లాటుకు నంబర్‌ ఉంటుంది.

► బెడ్‌రూమ్, పెద్ద హాలు, కిచెన్, వరండా, టాయిలెట్‌ సదుపాయాలతో ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు నిర్మించేలా ప్లాన్‌ రూపొందించారు.

► ప్రతి కాలనీలో డ్రైనేజి, తాగునీటి పైపులైను, విద్యుత్తు తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

► తూర్పు గోదావరి జిల్లా 3,65,224 మంది లబ్ధిదారులతో ప్రథమ స్థానంలో ఉంది. కొత్తగా వచ్చిన అర్జీలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశాక ఈ సంఖ్య మరింత పెరగనుంది. ధరలు ఎక్కువగా ఉన్నందున భూసేకరణ వ్యయం కూడా ఇక్కడ ఎక్కువే.

వైఎస్సార్‌ జిల్లాలో 7,284 ప్లాట్లతో ఒకే కాలనీ

► వైఎస్సార్‌ జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని 7,284 మందికి నివాస స్థలాలు ఇచ్చేందుకు లేఅవుట్‌ సిద్ధమవుతోంది.

► ఇక్కడ 257.53 ఎకరాల్లో గృహాలు నిర్మించేందుకు రోడ్లు, పార్కులు, వాణిజ్య సముదాయం, సామాజిక అవసరాలు, మౌలిక సదుపాయాల కోసం స్థలాల్ని కేటాయించి మాస్టర్‌ ప్లాన్‌ తరహాలో జిల్లా అధికారులు ప్లాట్లు వేస్తున్నారు.

► ఈ కాలనీ ప్రధాన రహదారి (30 మీటర్ల) 98.42 అడుగుల వెడల్పుతో ప్లాన్‌ చేశారు. కాలనీలో కొన్ని రోడ్లను 65.61 అడుగులు, మరికొన్ని రహదారులను 39.37 అడుగులు, కొన్ని అంతర్గత రహదారులను 30 అడుగుల వెడల్పుతో ప్లాన్‌ చేశారు.

► కాలనీలో మొత్తం 33, 390 మీటర్ల పొడవున రహదారులు ప్లాన్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories