Amaravati: నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర

Amaravati: అమరావతి టూ అరసవల్లి వరకు యాత్ర

Jyothi
Updated on: 12 Sept 2022 10:17 AM IST
All Set For Amaravati Farmers 2nd Phase Padayatra
X

Amaravati: నేటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర

Amaravati: ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని అనూహ్యంగా మళ్ళీ మూడు రాజధానుల కోసం అడుగులు వేస్తూ ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం మరోసారి కొత్త చర్చకు కారణం అవుతుంది.

అమరావతి ఏకైక రాజధాని నినాదంతో రైతులు చేపడుతున్న మలివిడత మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ్టి నుంచి ప్రారంభమైయ్యే ఈ యాత్రకు అడ్డంకులెన్ని వచ్చినా, యాత్రను ముగించే లక్ష్యంతో సాగేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించి, మద్దతు కూడగడతామని జేఏసీ నేతలు, రైతులు చెబుతున్నారు. ఒకవైపు రాజధాని రైతులు యాత్రకు అన్ని పార్టీలు అండగా ఉంటామని హామీ ఇవ్వడం, కోర్టు సైతం అనుమతిని ఇవ్వడంతో రైతులు యాత్రకు సిద్ధం అవుతున్నారు.

రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర.. అసమర్థుల అంతిమయాత్ర అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఉన్మాద యాత్ర అని విమర్శించారు. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారు? అని తమ్మినేని ప్రశ్నించారు. ఒకే రాజధాని ఉండడం వల్ల, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవడం వల్ల విభజన సమయంలో ఎంత నష్టపోయామో తెలియదా? అని నిలదీశారు.


Jyothi

Jyothi

Next Story