AP Municipal Elections 2021: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

Arun Chilukuri
Published on: 9 March 2021 4:49 PM IST
All Arrangements Set For Municipal Elections In Andhra Pradesh
X

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం (ఫైల్ ఇమేజ్ ) 

AP Municipal Elections 2021: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఎస్ఈసీ 75 మున్సిపాలిటీలకు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా నాలుగు మున్సిపాలిటీలు ఏకగ్రీవం అయ్యాయి మిగతా మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. రాష్ర్ట వ్యాప్తంగా 78 లక్షల 71 వేల 272 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనున్నది.

విజయనగరం, విశాఖ, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప కర్నూలు, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల, చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల మున్సిపాల్టీల్లోని అన్ని వార్డులు ఏకగ్రీవం కావడంతో ఆ నాలుగు మున్సిపాల్టీలు మినహాయించి 71 పురపాలక సంస్థలు, నగర పంచాయీతిల్లో పోలింగ్ కు సర్వం సిధ్దం చేశారు అధికారులు. రెండు వేల 215 డివిజన్లు, ఏడు వేల 552 మంది వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7 వేల 915 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస-కాశిబుగ్గ, పాలకొండ మున్సిపాల్టీలకు, విజయగరం జిల్లా బొబ్బిలి, పార్వతిపురం, సాలూరు, నెల్లిమర్ల, విశాఖ జిల్లా నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం, పెద్దాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, నిడదవోలు, కొవ్వారు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీల్లో పోలింగ్ కోసం ఏర్పాట్లుపూర్తి చేశారు అధికారులు.

కృష్ణా జిల్లా నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరుపూరు, గుంటూరు జిల్లా తెనాలి, చిలకలూరిపేట, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, ప్రకాశం జిల్లా చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, అనంతపురం జిల్లా హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాల్టీలకు పోలింగ్ జరగనున్నది.

కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల, ఎమ్మగనూరు, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, గూడూరు, ఆత్మకూర్, కడప జిల్లా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల, చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు, నగరి, పుత్తూరు పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వాహణకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలోనే అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14న వెలువడే ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story