ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్!

* ఈనెల 31తో ముగియనున్న నీలం సాహ్నీ పదవీకాలం * సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్నీ నియామకం * నీలం సాహ్నీకి కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ ఉత్తర్వులు * ముగ్గురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు, పోస్టింగ్స్‌

K V D Varma
Published on: 22 Dec 2020 6:14 PM IST
ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్ అపాయింట్ అయ్యారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ పదవీ కాలం.... ఈనెల 31తో ముగియనుండటంతో... ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వం నియమించింది. పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నీని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నూతన సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్... ఈనెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు.

చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్‌ దాస్‌ను నియమించిన ప్రభుత్వం... ముగ్గురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావును... ఏపీ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను... ఏపీ పురపాలకశాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్ రిలీవైన తర్వాత జలవనరులశాఖ కార్యదర్శిగా జె.శ్యామలరావు బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి కె.సునీతకు.... ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ‌్యతలు అప్పగించింది. ఇక, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు.... ఇరిగేషన్ ఓఎస్డీగానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇక, ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్నీని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్నీకి కేబినెట్ ర్యాంక్ హోదా కూడా కల్పించింది. హెల్త్, కోవిడ్ మేనేజ్‌మెంట్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, విభజన అంశాలు, గ్రామ సచివాలయాల బలోపేతంలాంటి బాధ్యతలను నీలం సాహ్నీకి ప్రభుత్వం అప్పగించింది.

K V D Varma

K V D Varma

Next Story