తాను చనిపోతూ ముగ్గురికి పునర్జన్మనిచ్చిన మహిళ

అవయవదానం చేసిన ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి

Shashank Gullapelli
Published on: 13 April 2024 2:38 PM IST
A Woman Died And Reincarnated Three People
X

తాను చనిపోతూ ముగ్గురికి పునర్జన్మనిచ్చిన మహిళ

AP News: అవయవదానం ఓ సంకల్పం. తాను చనిపోతూ... పలువురి జీవితాల్లో వెలుగులు నింపడమే అవయవదానం. అన్నదానం, విద్యాదానం ఇలా ఎన్నో రకాలున్నాయి. దానాలు అన్నింటిలోకెల్లా ఫలానా దానమే గొప్ప అని అంటుంటారు. అది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవయవదానానికి మించినది మరొకటి లేదు. ఇందుకు కారణం... అవయవాల అవసరాలు ఎక్కువగాను... వాటిని ఇచ్చే వారు తక్కువగానూ ఉండటమే.

తాను చనిపోతూ... ముగ్గురికి పునర్జన్మనిచ్చింది ఓ మహిళ. అవయవదానంతో మూడు కుటుంబాల్లో వెలుగులు నింపింది. సదరు మహిళ కుటుంబం సైతం అవయవదానానికి ముందుకు వచ్చింది. ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి అనే మహిళకు ఈ నెల 11న ఫిట్స్ రావడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం తీసుకొచ్చారు. హాస్పటల్‌లో చేరిన అనంతరం బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో... ఆపరేషన్ చేసి అవయవాలను తీశారు. జీవనధార ఆధ్వర్యంలో కృష్ణవేణికి చెందిన గుండె, కిడ్ని, లివర్‌ను తీసుకున్నారు.

ఓ వైపు కృష్ణవేణి కుటుంబం... మరోవైపు ప్రభుత్వం నుంచి సైతం సహకారం అందించడంతో... అవయవాలను వీలైనంత త్వరగా తరలించగలగారు వైద్యులు. కిడ్నీని కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు పోలీస్ అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అక్కడ శస్త్రచికిత్స చేసి కిడ్నీని అమర్చే అవకాశం ఉంది. ఇక గుండె, లివర్‌ను ఓర్వకల్లు విమనాశ్రయం నుంచి తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. స్వీమ్స్‌లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నారు. ఇక పద్మావతి హృదయాలయంలో గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story