Video : వికెట్ పడకుండానే సాక్షి సంబరాలు..తల పట్టుకున్న ధోనీ..వాంఖడేలో నవ్వుల పువ్వులు
Video : భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో సాక్షి ధోనీ పొరపాటున సెలబ్రేట్ చేసుకోవడం, దానికి ఎం.ఎస్. ధోనీ ఇచ్చిన కూల్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sakshi Dhoni celebration Wankhede
Video : ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన భారత్-ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కేవలం పరుగుల వరదకే కాదు, గ్యాలరీలో జరిగిన ఒక సరదా సంఘటనకు కూడా వేదికైంది. టీమిండియా మాజీ సారథి, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి ఈ ఉత్కంఠభరిత పోరాటాన్ని వీక్షించేందుకు వచ్చారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఎంతో సీరియస్గా కనిపించిన ధోనీ, ఒకానొక దశలో తన భార్య చేసిన పనికి ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సాక్షి అత్యుత్సాహం.. ధోనీ కూల్ రియాక్షన్
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఈ ఆసక్తికరమైన ఘటన జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని శామ్ కర్రన్ ఎదుర్కోగా, అది నేరుగా బుమ్రా వైపు వచ్చింది. బుమ్రా తన ఫాలో-త్రూలో బంతిని కింద పడకుండా ఆపినట్లు అనిపించింది. అది చూసిన సాక్షి, బుమ్రా అద్భుతమైన క్యాచ్ పట్టేశాడని భావించి స్టాండ్స్లో ఎగిరి గంతేస్తూ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే నిజానికి బంతి బుమ్రా చేతికి చిక్కే ముందే నేలను తాకింది. అంపైర్లు అది నాటౌట్ అని ప్రకటించారు. మైదానంలోని ఆటగాళ్లందరికీ అది క్లారిటీ ఉన్నా, సాక్షి మాత్రం అది వికెట్ అనుకుని ఊగిపోయారు. ఇది గమనించిన ధోనీ, నవ్వుతూ తనదైన శైలిలో భార్యను కూల్ కూల్.. అది వికెట్ కాదు అన్నట్లుగా సైగ చేశారు. ధోనీ రియాక్షన్ చూసి పక్కనే ఉన్న రోహిత్ శర్మ, రితికా సజ్దే కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
హోరాహోరీ పోరు.. భారత్ ఘనవిజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టీమిండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. సంజూ శాంసన్ (89), శివమ్ దూబే (43) మెరుపు ఇన్నింగ్స్ల పుణ్యమా అని భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కుర్రాడు జాకబ్ బెథెల్ (105) అద్భుత సెంచరీతో భారత్ను భయపెట్టినప్పటికీ, చివరికి టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత్ ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.