Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఉత్సవ వేదికగా మార్చి నెల
Andhra Pradesh: 2026 మార్చి నెల దుమ్ము రేపుతోంది. సహజంగా దసరా దమాఖా.. సంక్రాంతి దమాఖాలు ఉంటాయి. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం ఉగాది దమాఖా అన్నట్టుగా పెద్ద ఎత్తున సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఉత్సవ వేదికగా మార్చి నెల
ఆంధ్రప్రదేశ్: 2026 మార్చి నెల దుమ్ము రేపుతోంది. సహజంగా దసరా దమాఖా.. సంక్రాంతి దమాఖాలు ఉంటాయి. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం ఉగాది దమాఖా అన్నట్టుగా పెద్ద ఎత్తున సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ నెలలో జరిగిన ప్రతి కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిగా మారుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళల కోసం తీసుకున్న నిర్ణయాలు, యువత కోసం విడుదల చేయబోతున్న జాబ్ క్యాలెండర్, ప్రపంచ స్థాయి పరిశ్రమలకు శంకుస్థాపనలు. అలాగే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వార వివిధ వర్గాల్లో సంతోషాన్ని నింపేలా మార్చి నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మహిళా సాధికారత - 'స్వయం' బ్రాండ్ విప్లవం
ఈ నెలలో అత్యంత కీలకమైన ఘట్టం మహిళల ఆర్థిక పురోభివృద్ధి. మహిళా దినోత్సవం కానుకగా బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 10 వేల కోట్ల మేర భారీ ఎత్తున రుణాలను డ్వాక్రా మహిళలకు అందించింది. కేవలం ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా, ఏకంగా 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే అద్భుతమైన సంకల్పాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, సరైన మార్కెటింగ్ కల్పించేందుకు 'స్వయం' (SWAYAM) పేరుతో ప్రత్యేక బ్రాండ్ను, లోగోను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మహిళల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కనుంది.
అన్నదాత సుఖీభవ మరియు సామాజిక భద్రత
వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను విడుదల చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. 46.85 లక్షల మంది రైతులకు లబ్ది కలిగేలా రూ. 2676 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
నెల్లూరు జిల్లాలో సముద్రయాన విప్లవం - సాగర్ డిఫెన్స్
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వేదికగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇక్కడ అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ ను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రముఖ సంస్థ 'సాగర్ డిఫెన్స్' చేపట్టింది. మొదటి దశలో రూ. 45 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా జువ్వలదిన్నె ప్రాజెక్టు ఒక కీలక మలుపు కానుంది.
పోలవరం నిర్వాసితులకు ఊరట
పోలవరం నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపుతూ పునరావాస నిధులను విడుదల చేశారు. రూ. 226 కోట్లను నిర్వాసితుల కోసం ప్రభుత్వం విడుదల చేసింది. ఉగాది పండుగ ముందు రోజు నిధులను విడుదల చేసి.. నిర్వాసితుల్లో ప్రభుత్వం ఆనందాన్ని నింపింది.
దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని పెంచేలా దివ్యాంగ శక్తి
ఇక సామాజిక బాధ్యతగా దివ్యాంగులకు 'దివ్యాంగ శక్తి' పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు కల్పించింది. వీరి వెంట సహయకులకు కూడా 50 శాతం రాయితీతో పథకాన్ని వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 12.76 లక్షల మందికి లబ్ది చేకూరింది.
ఈద్ ముబారక్
రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాల విడుదల చేశారు. మొత్తంగా రూ. 45 కోట్ల నిధులను 10 వేల మంది ఖాతాల్లో జమ చేశారు. మొత్తంగా ఆరు నెలలుగా ఉన్న పెండింగ్ గౌరవ వేతనాన్ని ప్రభుత్వం క్లియర్ చేసింది.
అమరావతిలో అమరజీవి
రాజధానిలోని శాఖమూరు పార్కులో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ ను ఆవిష్కరించారు. రికార్డు స్థాయిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేశారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధికి అమరజీవి విగ్రహం సాక్షిభూతంగా నిలవబోతోంది.
చిన్న కాంట్రాక్టర్లుకు పెద్ద ఊరట
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టినా గత ప్రభుత్వం చాలా బిల్లులను పెండింగులో పెట్టింది. దీంతో చాలా మంది చిన్న చితకా కాంట్రాక్టర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా పెండింగ్ బిల్లులను నెమ్మదిగా విడుదల చేసుకుంటూ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది ఏపీ ఆర్థిక శాఖ. ఈ క్రమంలో సుమారు 50 వేల మంది కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా సుమారు రూ. 2 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
యువతకు ఉద్యోగాల పండుగ: జాబ్ క్యాలెండర్ విడుదల
రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఆనందం నింపేలా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తంగా 10,060 పోస్టులను భర్తీ చేసేలా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి ప్రైవేట్ రంగ పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఒకే రోజు రూ. 55.63 కోట్ల CMRF నిధుల విడుదల
ఉగాది పర్వదినాన వైద్యసాయం ఆశిస్తూ సీఎంకు దరఖాస్తు చేసుకున్న 6,787 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ రూ.55.63 కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ నిధులను ఒకే రోజు విడుదల చేశారు. తెలుగు వారి కొత్త సంవత్సరం తొలి రోజున పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ... సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై ముఖ్యమంత్రి సంతకం చేశారు.
ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ - పారిశ్రామిక గమ్యం
ఈ నెల 23వ తేదీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో కీలకమైన రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థలలో ఒకటైన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.