ఆర్టీసీ సమ్మె 23 వ రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం టీఎంయూ 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. సమ్మెపై తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎంయూ జెండా రంగు మార్చింది. జెండా నుంచి గులాబీ రంగును తొలగించి తెల్లరంగు జెండాను రూపొందించారు. మధ్యలో బ్లూ కలర్లో టీఎంయూ అక్షరాలు తీర్చిదిద్ది ధనస్సు గుర్తును ఉంచారు. ఈ కొత్త జెండాతోనే కాసేపట్లో టీఎంయూ ఆవిర్భావ దినోత్సవం జరపుకోనుంది.
మరోవైపు ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక నేతల చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. నిన్న అర్ధాంతరంగా ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్శర్మ నేతృత్వంలో జరిగిన చర్చల నుంచి మధ్యలో వెనుదిరిగిన జేఏసీ నేతలు మళ్లీ రాలేదంటూ సునీల్ శర్మ వెల్లడించారు. దీంతో చర్చలు ఇవాళ కొనసాగుతాయా..? లేదా..? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై రేపు హైకోర్టులో వాదనలు ఉన్నందున జేఏసీ నేతలు న్యాయవాదిని కలుస్తారని తెలుస్తోంది.