పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో గులాబీ పార్టీ అలర్ట్ అయ్యింది. అలాగే, జమ్మూకశ్మీర్పై మోడీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఓటర్లు బీజేపీ వైపు మళ్లకుండా పావులు కదుపుతోంది. ముఖ్యంగా అర్బన్ ఓటర్లు కమలం వైపు చూడకుండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రేటర్ టూర్కు రెడీ అవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోకపోవడంతో గులాబీ నేతలపై సీరియస్ అయిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేడర్లో జోష్ నింపేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానుండటంతో మరోసారి అఖండ విజయం సాధించి నగరంలో గులాబీ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు టార్గెట్లలో గ్రేటర్ లీడర్లు వెనుకబడటంతో తెలంగాణ భవన్కు పిలిచి మందలించిన కేటీఆర్ లక్ష్యాలను చేరుకోవాలంటూ మంత్రులు తలసాని, మల్లారెడ్డికి ఆదేశాలిచ్చారు. అయితే, అధిష్టానం ఆశించిన స్థాయిలో గ్రేటర్ లీడర్ల పనిచేయడం లేదని భావించిన కేటీఆర్ నియోజకవర్గాల వారీగా పర్యటనకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా పుంజుకోవడంతో అర్బన్ ఓటర్లు కమలం వైపు ఆకర్షితులు అవుతున్నారని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే, గ్రేటర్లో పర్యటించడం ద్వారా ప్రజలకు దగ్గరై, సభ్యత్వాలను పెంచుకోవాలని చూస్తోంది. అలాగే జమ్మూకశ్మీర్ పరిణామాలు తెలంగాణలో ప్రభావం చూపకుండా గులాబీ పార్టీ జాగ్రత్తపడుతోంది.