Municipal Elections 2020: మునిసిపోల్స్లో ఫేస్ రికగ్నిషన్ యాప్..
తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ వినూత్న ప్రయోగం చేయబోతుంది.
తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ వినూత్న ప్రయోగం చేయబోతుంది. భారత దేశంలోనే ఏ ఎన్నికలలోనూ ప్రయోగించని " ఫేస్ రికగ్నిషన్ " యాప్ ను మొట్టమొదటి సారిగా ప్రయోగించబోతున్నారు. ఈ యాప్ ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీలోని పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా 10 పోలింగ్ స్టేషన్లలో అమలు చేయనున్నట్లు అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తానే ఓటరునంటూ పౌరులు సమర్పించే ధ్రువపత్రాలతో సంబంధం లేకుండా ఓటరును గుర్తించవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఓటరుకి సంబంధించిన పూర్తి వివరాలను సునాయాసంగా తెలుసుకోవచ్చని, ఓటరు ముఖాన్ని చూసి అతడు ఓటరేనా? కాదా? అనేది 10 సెకన్లలో తేల్చేయగల సాంకేతికతను ప్రయోగాత్మకంగా వాడనుంది.
కృత్రిమ మేధ, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్ల మేళవింపుగా ఈ సాంకేతికత పనిచేస్తుందని వెల్లడించింది. పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ఫోన్తో తీసే ఓటర్ల ఫొటోలను భద్రపర్చబోమని, ధ్రువీకరణ పూర్తవగానే తొలగిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ఇక రాష్ట్రం వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలలో ఉన్న తొమ్మిది మున్సిపల్ కార్పోరేషన్లకు గాను ఈ నెల 22 నే పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక పోతే కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 25 న జరుగుతుండడంతో అక్కడి తుది ఫలితాలు జనవరి 27 న ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.