తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమైంది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
జూన్ 8 నుంచి జూలై 5వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 నిమిషాలకు వరకు జరుగనున్నాయి. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.