ఉస్మానియా వద్ద ఉద్రిక్తత
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్రెడ్డి బృందం ఓయూ భూములను పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఒక్క సారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆదివారం ఓయూ భూములను పరిశీలించడానికి అక్కడికి చేరకోగా ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
దీంతో అప్రమత్తమైన పోలీసులు టీపీసీసీ నేతలను అడ్డుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (వీ హనుమంతరావు) పోలీసులతో గొడవకు దిగారు. భూములు పరిశీలించడానికి వచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నిలాదీసారు. ఓయూని డెడ్ చేసి ప్రైవేటు వ్యక్తులకు యూనివర్శిటీ శాంక్షన్ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసు రక్షణ కల్పించి, నిర్మాణాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన విమర్శించారు. అందులో భాగంగానే మొన్న మూడు వర్శిటీలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని విమర్శించారు. ప్రైవేటీకరణ చేస్తే అందులో సామాన్యులు చదువుకునే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇక పోతే ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, ఉస్మానియా భూములు, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేసారు. అంతే కాక జూన్ 2వ తేదీన కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద, జూన్ 6వ తేదీన గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల వద్ద కృష్ణా, గోదావరి నదులపై పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రాజెక్టుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న అంశంపై చర్చించిన టీపీసీసీ నేతలు ఆదివారం ఉస్మానియాకు వెళ్లాలని నిర్ణయించారు.