పేదలపై కరెంట్ బిల్లుల భారం వేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు ఎక్కువగా విద్యుత్ బిల్లులు రావడంతో దాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేడు చలో సెక్రటేరియేట్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమయి తెలంగాణ సచివాయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ నేతల ఇండ్లను మోహరించి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యులైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు. దీంతో టీ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై స్లాబులు పేరుతో అధిక బిల్లులు వేసి వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం పేద ప్రజల నెత్తిపై అడ్డగోలు విద్యుత్ బిల్లులను వేస్తుందని తెలిపారు. తాము సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదని నియంతృత్వ వ్యవసాయ విధానం, అడ్డగోలు విద్యుత్ బిల్లులు, కరోనాపై ముఖ్యమంత్రితో కలిసి చర్చించేందుకు అపాయిమెంట్ మాత్రమే అడిగామని అయినా ఇవ్వలేదన్నారు. పోలీసులు కనీస సమాచారం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారని వారిపై మండిపడ్డారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. పాలన నిర్బంధం కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.