టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సమావేశమైన కుంతియా కొత్త బాస్ ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్రెడ్డి, జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సమావేశమైన టీపీసీసీ కోర్ కమిటీ కొత్త బాస్ ఎంపికపై చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా, ఉత్తమ్కుమార్రెడ్డి, ముఖ్యనేతలు హాజరై చర్చలు జరిపారు. అలాగే పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, మున్సిపల్ ఎన్నికల వ్యూహం, వలసలపైనా సుదీర్ఘంగా చర్చించారు.
దేశానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్గాంధీ నాయకత్వం అవసరమన్న టీపీసీసీ కోర్ కమిటీ రాహుల్ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలంటూ తీర్మానం చేశారు. రాహుల్గాంధీయే... ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ ముక్తకంఠంతో కోరారు. కాంగ్రెస్కే ప్రజలు షోకాజ్ నోటీస్ ఇస్తారంటూ వ్యాఖ్యానించిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీపీసీసీ కోర్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అదేసమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై వేటు వేయాలని క్రమశిక్షణా కమిటీ సిఫార్సు చేసింది. అయితే అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ నిర్ణయాన్ని కుంతియా వాయిదా వేశారు.