స్టీల్ బ్యాంకు ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 4,9,13 వార్డుల్లో బాల వికాస, మున్సిపాల్టీ సంయుక్త భాగస్వామ్యంతో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసారు.
సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 4,9,13 వార్డుల్లో బాల వికాస, మున్సిపాల్టీ సంయుక్త భాగస్వామ్యంతో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసారు.ఈ స్టీల్ బ్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత పట్టణానికి పునాది స్టీల్ బ్యాంకు అని ఆయన అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుందని ఆయన అన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ లాంటి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరుతాయని ఆయన అన్నారు. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చని, ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమన్నారు. స్టీల్ బ్యాంకు మన వార్డులోని ప్రజలు ఇండ్లలో ఏ ఫంక్షన్ చేసుకున్నా తక్కువ ధరలోనే స్టీల్ వస్తువులను పొందవచ్చని తెలిపారు. ఇందులో 12 రకాల వస్తువులు, 750 ప్లేట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అంతే కాక ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ సిద్దిపేట కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడమని, ఇక నుంచి మటన్, చికెన్ షాపుల మార్కెట్లకు వెళ్తే స్టీల్ బాక్సులు, జనపనార బట్ట సంచిని తీసుకెళ్తామని వార్డు ప్రజల చేత మనసాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని ఆయన అన్నారు. పర్యావరణ ప్రేమికురాలు డా.శాంతి చేపట్టిన కార్యక్రమాలతో మూడు వారాల్లోనే చాలా మార్పు వచ్చిందని ఆయన తెలిపారు. బయట చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి సూచించారు.
అనంతరం కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుందని అది తగ్గిన తరువాత తగ్గాక డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా నర్సపురం వాసులకు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. గోదావరి జలాలను మరో 15 రోజుల్లో నర్సపురానికి తేనున్నట్లు మంత్రి తెలిపారు.