పొంతన లేని వివరాలతో తెలంగాణా ఇంటర్ బోర్డు గందరగోళాన్ని సృష్టిస్తోంది. పరిస్థితిలోని తీవ్రతను.. విద్యార్థులు భవిష్యత్తుపై కమ్ముకున్న నీలినీడలు.. ఇన్తవరకూ ఇంటర్ బోర్డు గుర్తించినట్టు కనిపించడం లేదు. తప్పుల తడకలతో ఇంటర్ పరీక్షా ఫలితాలను వెల్లడించి అపఖ్యాతి మూటగట్టుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు రీవెరిఫికేషన్కు సంబంధించిన ఫలితాల గణాంకాల్లోనూ పిల్లిమొగ్గలు వేస్తోంది. పరీక్ష తప్పిన విద్యార్థుల్లో రీ వెరిఫికేషన్ లో ఒక సారి 1137.. మరోసారి 1155 మంది పాసయ్యారన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్.. తాజాగా 1183 మంది ఉత్తీర్ణులయ్యారని కోర్టుకు ఇచ్చిన సమాచారం లో వెల్లడించారు.
గత నెల 27న రాత్రి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఫెయిలైన వారిలో 1137 మంది ఉత్తీర్ణులైనట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఆ తర్వాత 4న నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 1155 మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. ఈ రోజు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో మాత్రం 1183 మంది ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారు. మరో 19,788 జవాబు పత్రాల స్కానింగ్, అప్లోడ్ ప్రక్రియ కొనసాగుతోందని గత నెల 27న ఓ ప్రకటనలో వెల్లడించిన ఇంటర్ బోర్డు.. మరో 800 మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడించాల్సి ఉందని ఈ నెల 4న మీడియాకు తెలిపింది. కానీ.. ఇంకా మరో 8వేల జవాబు పత్రాల స్కానింగ్ జరగాల్సి ఉందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అయితే, గత నెల 27నే ఫెయిలైన విద్యార్థులందరి ఫలితాలను ప్రకటించేశామని, జవాబుపత్రాలను సైతం అప్లోడ్ చేశామని తాజాగా హైకోర్టుకు నివేదించింది. ఇలా రోజుకో గణాంకాలు చెప్పడంతో ఇంటర్ బోర్డు విశ్వసనీయతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ ఫలితాలు వెల్లడించడంలో ఘోర తప్పిదాలు చేసిన ఇంటర్ బోర్డు.. రీవెరిఫికేషన్ ప్రక్రియలో కూడా గందరగోళం సృష్టించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రెండురోజుల్లో తెలంగాణా ఎంసెట్ ఫలితాలు వెల్లడవనున్న నేపథ్యంలో ఇంకా రీవెరిఫికేషన్ ప్రక్రియంతా గందరగోళంగా జరగడంపై విద్యార్థుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.