తెలంగాణ ప్రభుత్వంపై కొత్తగా వచ్చిన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ప్రభుత్వ పనితీరును కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న వర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం సమ ప్రాధాన్యతనిస్తోందని గవర్నర్ గుర్తుచేశారు. తెలంగాణలో జరుగుతున్న అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని సౌందర్య రాజన్ ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన 30రోజుల ప్రణాళిక ఓ మంచి కార్యక్రమమని కొనియాడారు. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డు సృష్టిస్తోందన్నారు.