తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇప్పుడు ప్రభుత్వాలను, ప్రజలను కలవర పెడుతోంది. ఢిల్లీలో మర్కజ్లో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో తెలుగువారు వెల్లినట్టు తెలియడంతో అధికారులు అలర్టయ్యారు. మార్చి 1 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగ్-ఏ-జమాత్ అనే సంస్థ మతపరమైన కార్యక్రమం నిర్వహించింది. దీనికి వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని వేర్వేరు చోట్ల నుంచి అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఆరుగురు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణ నుంచి ప్రాంతాల వారీగా మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు: హైదరాబాద్ 186, మెదక్ 26 , వరంగల్ 25 , నల్గొండ 21 , నిజామాబాద్ 18 , కరీంనగర్ 17 , రంగారెడ్డి 15 , ఖమ్మం 15 , నిర్మల్ 11 , భైంసా 11 , ఆదిలాబాద్ 10 .
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్నవారు తమకు తాముగా వచ్చి అధికారులను కలవాలని చెప్పింది. వారందరికీ ఉచితంగా పరీక్షలు జరిపి, ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తామని స్పష్టం చేసింది. ఎవరూ ఎలాంటి ఆందోళనలూ పెట్టుకోకుండా వాస్తవాలు చెప్పాలని కోరింది.