తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్..రోడ్డెక్కని బస్సులు, ప్రయాణీకుల ఇబ్బందులు
తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఇవాళ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన ఆర్టీసీ యూనియన్లు ఆందోళనకు దిగాయి. ఉదయం నుంచి అన్ని డిపోల ముందు కార్మికులు నిరసనకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులేవీ రోడ్డెక్కలేదు. బంద్కు తెలంగాణలోని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, జనసేన కూడా మద్దతు ప్రకటించింది. దీంతో ఉదయం నుంచే ఆందోళనలు, ర్యాలీలతో బంద్ ప్రభావం కనిపించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.
దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల ఊళ్లల్లోకి వెళ్లే ప్రయాణీకులు బస్సుల కోసం బస్టాండ్లలోనే వేచిచూస్తున్నారు. మరోవైపు ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. తెలంగాణలో ప్రధాన డిపోలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ తో పాటు ఇతర జిల్లాల్లో భారీగా కార్మికులు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకు దిగారు.
ఇటు రాజధానిలో బస్సులేవీ రోడ్డెక్కలేదు. ప్రధాన బస్టాండ్లైన జూబ్లీ, ఎంజీబీఎస్ బస్టాండ్లో బస్సులు కనిపించడం లేదు. ఉదయం నుంచి డిపోల ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బస్సులు డిపోల నుంచి రాకుండా అడ్డుకున్నారు. తెల్లవారుజామునే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ వంటి నగరాలకు బస్సులు బయల్దేరనున్నాయి. అయితే సింగల్ బస్ కూడా రోడ్డెక్కకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఇక ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు తమ డిమాండ్ల సాధన కోసం ప్రైవేట్ క్యాబులు కూడా బంద్ పాటించడంతో నగరంలో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.