YS Sharmila Deeksha: కొనసాగుతోన్న షర్మిల దీక్ష
YS Sharmila Deeksha: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది.
YS Sharmila Deeksha: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. మూడు రోజులు పాటు చేపట్టిన దీక్షకు పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతించిన విషయం తెలిసిందే. మొదటి రోజు గురువారం ఉదయం ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్లో షర్మిల దీక్షను ప్రారంభించారు. కాగా, సాయంత్రం ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కొలువు దీక్ష తర్వాత వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ నుంచి లోటస్ పాండ్ వరకు తలపెట్టిన పాదయాత్రను పోలుసులు భగ్నం చేశారు. ఈ మేరకు ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఆమె పాదయాత్ర కొనసాగించేందుకే మొగ్గు చూపారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఆమె స్పృహతప్పి పడిపోయారు. తేరుకున్నాక షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు.
దీంతో నిన్న సాయంత్రం నుంచి లోటస్పాండ్లోని ఆమె నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షలో కూర్చున్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని.. 72గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో జులై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని షర్మిల ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. షర్మిల ముందుగా మూడు రోజులు దీక్ష నిర్వహించాలని భావించారు. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆమె ఎప్పటివరకు దీక్ష చేస్తారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఖమ్మంలో సంకల్ప సభ పేరుతో జరిగిన మొదటి సభలోనే షర్మిల ప్రభుత్వానికి అల్టిమేటం జారి చేశారు