కొవిడ్ విసిరిన పంజా ఫలితం అంతా ఇంతా కాదు. ఇదీ..అదీ.. అని లేకుండా అన్ని రంగాలనూ ఓ కుదుపు కుదిపేసింది. ఇప్పట్లో కోలుకునే అవకాశాల్లేకుండా దెబ్బతీసింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు నష్టాలు చవిచూస్తున్నాయి. అయినా లాక్డౌన్ సడలింపులతో మళ్లీ పనులు పట్టాలెక్కాయి. కానీ విద్యారంగం పరిస్థితేంటనేదే ఇప్పుడు అసలు సమస్య. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత బడులు తెరుచుకున్నా నిర్వహణ సంగతేంటి..? ఫీజులు పెంచితే తల్లిదండ్రుల పరిస్థితేంటి..?
దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. 2019-20 ఏడాది చదువులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తొమ్మిదో తరగతి వరకు స్కూల్ విద్యార్థులను నేరుగా ప్రమోట్ చేసినా బడులు ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టత లేకుండా పోయింది. ఇదిలా ఉంటే పది పరీక్షల గందరగోళం ఉన్నత చదువులకు పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారాయి.
పేదలైనా ధనికులైనా తమ పిల్లలకు మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయిలో ఉంచాలనే ఆలోచనతోనే ఉంటారు. ఎంత ఇబ్బందులు పడినా పిల్లల భవిష్యత్ ముఖ్యమనుకుంటారు. స్థోమత లేకున్నా ఎలాగోలా ప్రైవేట్ బడులకు పంపి చదువులు చెప్పిస్తున్నారు. కానీ లాక్డౌన్ తర్వాత పేద విద్యార్థుల పేరెంట్స్కు కష్టాలు తప్పేలా లేవు. లాక్డౌన్తో నష్టపోయిన విద్యాసంస్థలు ఆ తర్వాత ఫీజులు పెంచే అవకాశాలున్నాయంటున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు.
అటు స్కూల్ యాజమాన్యాలు కూడా నిర్వహణ భారంతో ఉక్కిరిబిక్కరి అవుతున్నాయి. ఈ ప్రభావం వేలల్లో ఫీజులు వసూలు చేసే బడ్జెట్ స్కూళ్లపైనే పడుతుందంటున్నారు నిర్వాహకులు. అడ్మిషన్లు లేకపోవటంతో స్కూళ్లు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకుంటే తప్ప విద్యాసంస్థలు నడిపే పరిస్థితి లేదంటున్నారు ట్రెస్మా సభ్యులు. ప్రభుత్వానికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాఠశాలలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.