సమత కేసు నిందితులను పోలీసులు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరపరిచారు. ఏ1 షేక్ బాబా, ఏ2 షేక్ శంషోద్దీన్, ఏ3 షేక్ ముఖీమొద్దీన్ను భద్రత మధ్య కోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే 44 సాక్ష్యులను పొందుపరిచిన అధికారులు 150 పేజీలతో ఛార్జ్షీట్ అందించారు. మరోవైపు నిందితుల తరపున వాదించకూడదని బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో నిందితుల తరపున వాదించేందుకు ప్రభుత్వమే ఓ న్యాయవాదిని నియమించే అవకాశముంది. మరోవైపు నిందితుల జ్యూడీషియల్ కస్టడీని పొడిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కుమ్రంబీమ్ జిల్లా ఎల్లాపటార్ లో గత నెల 24వ తేదీన ముగ్గురు నిందితులు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే గొంతుకోసి చంపారని FSL పరీక్షలో నిర్థారణ అయ్యింది. DNA రిపోర్ట్తో పాటు వీర్యాన్ని పరీక్షించి పోలీసులు నిందితులను గుర్తించారు.