ఆర్ధిక మాంద్యం ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఉద్యోగుల వయో పరిమితి పెంచితే రిటైర్మెంట్ బెనిఫిట్ లను ఒకే సారి ఇవ్వకుండా మరి కొంత కాలం వాయిదా వేయవచ్చనే నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై సర్కార్ కసరత్తు చేస్తోంది.
దేశ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం ప్రభావంతో అన్ని రాష్ట్రాలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలో ఉద్యోగుల జీతభత్యాలు చాలా ఎక్కువ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం ఎక్కువే. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచాలని టీ సర్కార్ యోచిస్తోంది. దీంతో ఉద్యోగులకు ఇప్పటికిప్పుడు ఇచ్చే బెనిఫిట్స్ వాయిదా వేయవచ్చనేది ఆలోచన.
అంతే కాదు టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లోనూ ఉద్యోగుల వయో పరిమితి పెంపు పక్రటించింది. దీంతో ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయవచ్చనే ఆలోచన చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఇందులో భాగంగా 61 ఏళ్లకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచనున్నట్టు సమాచారం. ఈ డిసెంబర్ నెల వరకూ చాలా మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు. అంతకన్నా ముందుగానే ఉద్యోగుల వివరాలు తీయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీంతో ప్రభుత్వాధికారులు ఉద్యోగుల లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు.