గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన ఇంటి పన్నులు, మొండి బకాయి వసూళ్ల కోసం గ్రామ సర్పంచ్ వినూత్నంగా 'ట్యాక్సీ కట్టు.. బైక్ పట్టు' లక్కీ డ్రా కు శ్రీకారం చుట్టారు. అది ఎక్కడా? ఏంటన్నది తెలుసుకోవాలని ఉందా? వాచ్ దిస్ స్టోరీ.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామ పంచాయతీ ఇది. ఇక్కడ కొన్నేళ్లుగా ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఆ బకాయిలు ఎలాగైనా వసూలు చేయాలని భావించిన గ్రామసర్పంచ్ ఇంద్రలా రూప వినూత్నంగా ఆలోచించారు. ఇంటి పన్ను చెల్లించు గిప్ట్ పట్టు అనే పథకానికి శ్రీకారం చుట్టారు.
గ్రామంలో 2019- 2020 ఏడాదికి మొత్తం బకాయి 18 లక్షలు మొండి బకాయిగా ఉంది. అయితే, సర్పంచ్ ఆలోచనతో ఇంటి పన్ను బకాయి వసూళ్లు పుంజుకున్నాయి. లక్కీ డ్రా నేపథ్యంలో జనవరి 30 నాటికి 14 లక్షలు మొండి బకాయి వసూలైంది. దీంతో పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజాప్రతినిధుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో విజేతలను సర్పంచ్ ఎంపిక చేశారు.
మొదటి బహుమతి కింద హీరో బైక్ను గ్రామానికి చెందిన కల్ల గంగాధర్ దక్కించుకోగా, రెండో బహుమతి కింద ఎల్ఈడీ టీవీని బాలేరావు చిన్న నర్సు గెలుకుంది. మొండి బకాయిలు వసూలు చేసేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ రూపను అధికారులు, గ్రామస్తులు అభినందించారు. మొండి బకాయిలు చెల్లించని జనానికి ఈ స్కీం ఏదో బాగుంది కదూ. మరి మిగిలిన సర్పంచ్లూ ఇలా ఆలోచిస్తే పోలా.