చిన్నపిల్లలపై కోపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే కోప్పడతారు.. ఇంకా కోపం వస్తే చిన్న దెబ్బ కొడతారు.. కానీ ఓ లెక్కల మాస్టార్ లెక్కతప్పాడు. అతిదారుణంగా ఎనిదేళ్ల బాలుడిని చితకబాదాడు. విచక్షణ మరిచిపోయి కాలుతో ఇష్టం వచ్చినట్లు తన్నడంతో బాలుడు రాయిపై పడటంతో కన్నుకు తీవ్రగాయమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
కొత్తగూడెం బూడిదగడ్డ ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతోన్న సందేశ్ మరో విద్యార్ధితో కలిసి తరగతిగది నుంచి బయటకు వచ్చాడు. అక్కడే ఫోన్లో మాట్లాడుతున్న టీచర్ గాంధీ విద్యార్ధులపై ఆగ్రహాంతో విరుచుకుపడ్డాడు. పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తూ చిన్నారుల చితకబాదడంతో ఓ విద్యార్థి కన్నుకు దెబ్బతగిలింది.
గాయపడ్డ విద్యార్థిని సదరు టీచర్ స్ధానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరుకుట్లు వేశారు వైద్యులు. పైగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా మెల్లగా జారుకున్నాడు. గాయంతో ఇంటికి చేరుకున్న బిడ్డను చూసి కంగారుపడ్డ తల్లిదండ్రులు ప్రిన్స్పాల్కు ఫోన్ చేశారు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను చదువుకోవడానికి పంపిస్తే తీవ్రంగా గాయపరిచారని, ఈ దారుణానికి పాల్పడ్డ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.