తెలంగాణ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.. ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుముర్తి లింగయ్య, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరావు లు టీఆరెస్ లో చేరుతుండగా.. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కూడా 'కారు'ఎక్కేందుకు టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నట్లు వెల్లడించారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎత్తుగడలతో కాంగ్రెస్ లో టెన్షన్ మొదలయింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునుంచే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన ఏడుగురు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించగా, మరో నలుగురు అదే బాటలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.