సీజనల్ వ్యాదులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా డెంగ్యూపై స్కూళ్లు, బస్తీలు, అపార్ట్మెంట్లో సదస్సులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పరిసరాల్లో నీటి నిల్వ కంటే ఇంట్లో నిల్వ ఉంచుకునే నీటి ద్వారానే డెంగ్యూ దోమలు వస్తున్నాయని ప్రజలు వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్లో జ్వరాలు తగ్గుముఖం పట్టాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో శానిటేషన్ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. గణేష్ మండపాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని మంత్రి సూచించారు.
ప్రజల సహకారం లేకుండా ఏ సమస్యా పరిష్కారం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో జ్వరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని కేటీర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఒక్కటే సమస్యను పరిష్కరించలేదని ప్రజల సహకారంతోనే జ్వరాల సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నగరంలో 106 బస్తీ దవాఖానులు ఉన్నాయన్న కేటీఆర్ ఇందులో సాయంత్రం ఓపీలను ప్రారంభించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అనుమతితో బస్తీ దవాఖానాలను పెంచుతామన్నారు.
హైదరాబాద్లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి కేటీఆర్. సీజన్లలో వచ్చే వ్యాదుల నివారణ, చర్యలపై జీహెచ్ఎంసీని క్యాలెండర్ను రూపొందించాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ వైద్య సేవలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ తో సమీక్ష నిర్వహించారు.