కాచిగూడ రైల్వే స్టేషన్ నింబోలి అడ్డ వద్ద ఆగి ఉన్న హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది. హంద్రీ ఎక్స్ప్రెస్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్పైకి వచ్చిన ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టింది. దీంతో ఎంఎంటీఎస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హంద్రీ ఎక్స్ప్రెస్ ట్రైన్ వేగం తక్కువ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూడు కోచ్లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్లు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ ట్రైన్ డ్రైవర్ శేఖర్ ఇంజన్లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శిస్తున్నారు. ట్రాక్పై ఒక రైలు ఉండగా మరో రైలుకు ఎలా సిగ్నల్ ఇస్తారని ప్రశ్నించారు.