Coronavirus: కాటేస్తున్న కరోనా.. హైదరాబాద్లో హై అలర్ట్
గత 3 రోజులుగా కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గజగజ లాడిస్తుంది. ప్రపంచ దేశాల్లో అది శరవేగంగా పాకుతుండడంతో భారత్ ముందుగానే అప్రమత్తమైంది.
గత 3 రోజులుగా కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గజగజ లాడిస్తుంది. ప్రపంచ దేశాల్లో అది శరవేగంగా పాకుతుండడంతో భారత్ ముందుగానే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇరుగు పొరుగు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైనా, హాంగ్ కాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు ప్రత్యేక స్కానర్లను, వైద్యులను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం హాంక్ కాంగ్ నుంచి విమానం వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులను విమానం దిగగానే వైద్య పరీక్షలకు పంపించే విధంగా శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వారిలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కనబడితే వారిని వెంటనే నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించి రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
కాగా కేరళకు చెందిన ఓ నర్సు ఈ వైరస్ బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో భారతీయులందరూ భయాందోళనలకు గురవుతున్నారు.
ఇక కరోనా వైరస్ కు పుట్టినిల్లైన చైనాలో ఇప్పటికే 17 మంది వైరస్ కారణంగా చనిపోయారని నిర్ధారించారు. మరో 500 వందల మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఊహాన్ నగరంలో పుట్టిన వైరస్ మరో రెండు నగరాలకు పాకినట్లు చైనా మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో ఊహాన్ నగరంలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారని తెలిపారు.