ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో మూడు రోజుల పాటు పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే కోణంలో పెద్దపల్లి జిల్లాను కూడా సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన గవర్నర్ కు తోడుగా ఉండి ప్రతి ప్రాంతం విశిష్టతలను, గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసారు. ఈ నేపధ్యంలోనే కలెక్టర్ దేవసేనను, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్న అధికారులకు గవర్నర్ లేఖ రాశారు.
ఆ లేఖలో గవర్నర్ రాసిన అంశాలను పరిశీలిస్తే .. నా పర్యటన సందర్భంగా మీరు, మీ జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మీ ఆతిథ్యం మమ్మల్ని ఆకట్టుకుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా నేను చాలా సంతోషానికి గురయ్యానని కలెక్టర్ దేవసేనను అభినందించారు. అంతే కాకుండా ఇటీవల ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల విద్యార్థినుల్లో ఆత్మైస్థెర్యం నింపుతున్నారన్నారు. వారిని వారు రక్షించుకునే విధంగా 'శక్తి' అనే కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందరన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 6-10వ తరగతి బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణనివ్వడం చాలా మంచి నిర్ణయమని కొనియాడారు.
అనంతరం మహిళలు స్వశక్తితో ఎదగడానికి ఏర్పాటు చేసుకున్న కంపెనీ గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. బసంత్నగర్ మహిళలు తయారు చేస్తున్న బట్టబ్యాగులు, సబలల నాప్కిన్స్ తయారీ అద్భుతంగా ఉందన్నారు. అంతేకాకుండా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్మింపచేసిన నందిమేడారం, కాళేశ్వరం ప్యాకేజీ-6ను సందర్శించడం పట్ల గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు. నా పర్యటనకు సహకరించిన కలెక్టర్ దేవసేనకు, జిల్లా అధికారులకు, ప్రతి ఒక్కరికీ పేరపేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆమె లేఖలో పేర్కొన్నారు.