గిరిజన ప్రాంతాల్లో పర్యటించనున్న గవర్నర్ తమిళిసై

Update: 2019-12-07 03:04 GMT
తెలంగాణ గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. ముఖ్యంగా కొన్ని గిరిజన ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో గవర్నర్‌ పర్యటించేఅవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా తండాల్లోని ఆదివాసీలు, గిరిజనులు ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారో గవర్నర్ పరిశీలించనున్నారు. అంతే కాకుండా గిరిజన తండాల్లో గవర్నర్ గిరిజన ప్రజల ఆతిద్యాన్ని స్వీకరించి తండాల్లో బసచేసి వారితో సమస్యల గురించి, సమస్యల పరిష్కారం గురించి మాట్లాడనున్నారు.

దాంతో పాటు తెలంగాణలో భారీ మొత్తంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పరిశీలించనున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం భారీ బందోబస్తును ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. కొన్ని గిరిజన ప్రాంతాల్లో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం, మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు కూడా ఇదే సమయంలో జరుగుతుండడంతో గవర్నర్‌ ఏ గ్రామాన్ని సందర్శించనున్నారో అన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

గవర్నర్‌ రాష్ట్రంలో పర్యటిస్తూ రాత్రి ములుగు ప్రాంతంలో బసచేసే అవకాశం ఉంటే ఈ నెల 9వ తేదీ రాత్రి ములుగు జిల్లాలో పర్యటించి బసచేస్తారు. అక్కడ ఉన్న గిరిజనులతో ముచ్చటించి 10వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అంతే కాకుండా భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన ఓ జనరిక్‌ మందులషాపును కూడా గవర్నర్‌ ప్రారంభించనున్నారని సమాచారం.




Tags:    

Similar News