ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యం కొనేవారు కరవయ్యారని, న్యాయం చేయాలంటూ జనగామ మండలం అడవికేశ్వాపూర్ రైతులు జనగామ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రైతు రాంకోటి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆర్డీవో మధుమోహన్ కాళ్లపై పడి వేడుకున్నాడు.
అడవికేశ్వాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగడంతో పోలీసులు ఆర్డీవోకు సమాచారమిచ్చారు. ఆర్డీవో రాగానే రైతులు ఆయన కాళ్ల ముందు మోకరిల్లారు. అధికారులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆర్డీవో వెంటనే కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.