భైంసా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం తర్జన భర్జన పడుతోంది. భైంసాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థుల ప్రచారం మొదలుపెట్టలేదు. ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ భైంసాలో పూర్తిగా ప్రశాంత వాతావరణం ఏర్పడకపోతే ఎన్నికలను వాయిదావేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. త్వరలో జరిగే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు భైంసా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.
భైంసాలో 144 సెక్షన్ ఐదో రోజు కొనసాగుతోంది. గత ఆదివారం పట్టణంలోని కోర్వాగల్లీలో ఇరు వర్గాల ఘర్షణ రాళ్లదాడికి దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.